Publish Date: Thu, 23 May 2019 (18:56 IST)
Updated Date: Thu, 23 May 2019 (18:58 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్సభ ఎన్నికలు షాకిచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య రీతిలో గట్టిదెబ్బ తగిలింది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవితకు ఓటమి తప్పలేదు. కవిత నిజామాబాద్ స్థానంలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 68 వేలపై చీలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలైయ్యారు.
అదేవిధంగా కేసీఆర్ సన్నిహితుడు బి. వినోద్ కుమార్ కరీంనగర్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ గోడెం నగేశ్పై భారీ మెజారిటీతో లీడింగ్లో ఉన్నారు.
ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ.. బీజేపీ తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొందడం గమనార్హం. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లాంటి టీఆర్ఎస్ కంచుకోటలను బద్దలు కొట్టడమే కాకుండా.. సికింద్రాబాద్లో సైతం బీజేపీ గెలుపుదిశగా సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ కూడా ఏకంగా తెలంగాణలో నాలుగు స్థానాలు కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి విజయం సాధించగా.. చెవేళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయం సాధించారు.
webdunia
Publish Date: Thu, 23 May 2019 (18:56 IST)
Updated Date: Thu, 23 May 2019 (18:58 IST)