Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
తెలంగాణ అటవీ ప్రాంతాల్లో మళ్లీ యురేనియం వివాదం ముదురుతోంది. యురేనియం కోసం నల్లమల అడవిలో తవ్వకాలు చేపట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దేవరకొండలో విద్యావంతుల వేదిక ఆందోళనకు దిగింది.
విష్ణుప్రియ హోటల్ ముందు గోబ్యాక్ యూసీఐల్ అధికారులారా అంటూ నినాదాలు చేశారు. యురేనియం మాకొద్దు అంటూ ప్లేకార్డులు ప్రదర్శించారు. నిరసనకారుల్ని అడ్డుకున్నారు పోలీసులు. నచ్చ జెప్పే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది. ఈ ఆందోళనతో కేంద్ర అధికారులు వెనుదిగారు. యురేనియంను తవ్వితీసేందుకు 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో 400 చోట్ల డ్రిల్లింగ్కు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను యురేనియం కార్పోరేషన్ కోరింది.
దీనికి కొన్ని కండీషన్లు పెట్టింది అటవీశాఖ. ఈ కండిషన్లను పాటించకుండా తమ ఇష్టమొచ్చినట్లు యూరేనియం కార్పోరేషన్ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యురేనియం తవ్వకాలతో పరోక్షంగా 83 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలపై ప్రభావం పడుతుంది.
కృష్ణానది, నాగార్జున సాగర్పైనా దీని ఎఫెక్ట్ ఉంటుంది. యురేనియం తవ్వకాలతో.. రైతులు తీవ్రంగా నష్టపోతారని, గాలి కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతి లేకుండా రిజర్వ్ లో డ్రిల్లింగ్కు అనుమతించడం లేదు అటవీశాఖ. అటు ప్రజలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.