Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
చంద్రుడు దక్షిణ ధృవం అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పంపిన చంద్రయాన్-2 ప్రాజెక్టు చివరిక్షణంలో మొరాయించింది. ఇందులో అమర్చిన విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై హార్డ్ ల్యాండింగ్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ హార్డ్ ల్యాండింగ్ కారణంగా విక్రమ్ ల్యాండర్కు భూమండలంతో సంబంధాలు తెగిపోయాయి.
ఈ నేపథ్యంలో, విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందుకోవడానికి గత కొన్నిరోజుల నుంచి ఇస్రో వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. చివరికి నాసా సహకారం కూడా తీసుకుంది. అయితే, విక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నట్టేనన్న భావన కలుగుతోంది.
ఇస్రో తాజా ప్రకటన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. విక్రమ్ ల్యాండర్లో కదలికలు తెచ్చే ప్రయత్నాలు ఎంతకీ సఫలీకృతం కాని తరుణంలో, ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు అంటూ ఇస్రో ఓ ప్రకటన చేసింది. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, వారి స్వప్నాలే మాకు స్ఫూర్తి. మరింత ఉత్సాహంతో కొనసాగుతాం' అంటూ ఇస్రో ట్విట్టర్లో పేర్కొంది.