Publish Date: Wed, 04 Dec 2019 (19:50 IST)
Updated Date: Thu, 05 Dec 2019 (13:57 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం అధికంగా సాగుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై కూడా తన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించిందన్నారు. మాటలను వక్రీకరించడమనేది వైసీపీకి అలవాటైపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరి అండతో ఏపీలో సామూహిక మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన నిలదీశారు. 'నేను మీడియా సంస్థలకు కూడా చెబుతున్నాను. నేను మీకు వీడియో విడుదల చేస్తాను. సామూహిక మత మార్పిడి జరుపుతోన్న వీడియోను కూడా మీకు పంపుతాను. దాన్ని కూడా సంచలనం చేయండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి' అని పవన్ సూచించారు.
'వక్రీకరిస్తూ కాదు.. వాస్తవంగా జరుగుతోన్న విషయాలను చెప్పండి. మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలి. లేదంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీది. పాలన సరిగ్గా ఉండాలి' అని పవన్ అన్నారు.