Publish Date: Mon, 02 Sep 2019 (12:14 IST)
Updated Date: Mon, 02 Sep 2019 (12:16 IST)
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ ప్రాంగణంలోని ఓ వ్యక్తి కత్తి చేతపట్టుకుని దూసుకెళ్లాడు. అతన్ని గమనించిన భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా, దేశంలోని ప్రధాన నగరాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో పార్లమెంటు వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులోకి ఓ వ్యక్తి బైక్ పై దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా నిందితుడిని అడ్డుకున్న పోలీసులు, అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
2001, డిసెంబర్ 13న లష్కరే ఉగ్రవాదులు ఇదే గేటు(గేటు నంబర్ 1) నుంచి పార్లమెంటులోకి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశంలో హైఅలర్ట్ కొనసాగుతున్న వేళ ఓ వ్యక్తి కత్తి తీసుకుని పార్లమెంటులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంపై ఆందోళన నెలకొంది.