Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
ఈటల భూ కబ్జా ఆరోపణల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉదయం విచారణకు దిగిన రెవెన్యూ, విజిలెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రాథమిక నివేదికను సిద్ధం చేశాయి. మూడెకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందించనట్లుగా రూడీ అయినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ నిర్ధారించారు. ఉదయం నుంచి సర్వేను కలెక్టర్ హరీష్ పరిశీలించారు.
మాసాయిపేట తహసీల్దార్ ఆఫీస్లో మకాం వేసిన కలెక్టర్.. భూ రికార్డులను పరిశీలించారు. ఏండ్ల నుంచి ఉన్న రికార్డులను క్షుణంగా తనిఖీ చేశారు. అనంతరం ఈటల నిర్మాణం చేస్తున్న జమునా హాచరీస్లో మూడు ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయి సర్వే కూడా పూర్తి చేసి ఈరోజు నివేదికను సీఎస్కు సమర్పించే అవకాశం ఉంది.
రెవెన్యూతో పాటుగా విజిలెన్స్ నివేదిక కూడా రాత్రి వరకు సీఎం కేసీఆర్కు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవ్వాళ రాత్రి మంత్రి ఈటలను రాజీనామా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈటల వ్యవహారం రాష్ట్రాన్ని హీటెక్కిస్తోంది. ఆయా వర్గాల నుంచి ఈటలకు మద్దతు కూడా పెరుగుతోంది. ఒకవేళ మంత్రి వర్గం నుంచి ఈటలను రాజీనామా చేయిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే అంశాలపై కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకుంటున్నట్లు సమాచారం.