Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం ఆనవాయితీ. పెళ్ళి పీటల మీదకు రాబోయే వధువుకి ప్రత్యేకమైన స్నానం చేయిస్తే ఆ అమ్మాయి చర్మ సౌందర్యం కాంతిగా ఉండడమే కాకుండా శరీరం సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుందట. గులాబీ పూల రేకలను శుభ్రమైన నీటిలో వేసి కొన్ని గంటల సేపు ఉంచుతారు.
పెళ్ళి కూతురు శరీరానికి వెన్నెతో కలిపిన పసుపు, చందనం బాగా మర్థిస్తారు. ఆ తరువాత శెనగపిండితో మృదువుగా రుద్దుకున్నాక స్నానం చేయిస్తారు. పెళ్ళికూతురు స్నానం చేసే నీళ్ళలో గులాబీ రేకలు నానేసిన నీటిని పోస్తారు. కొంచెం పన్నీరు కూడా ఆ నీళ్ళలో కలపినట్లయితే ఆ అమ్మాయి చర్మం కాంతిగానూ, మృదువుగానూ, సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట.
స్నానానికి ఉపయోగించే నీటిలో మరువం, దవనం లాంటి సువాసనలు వెదజల్లే వాటిని వేయవచ్చు. సంపంగి, మల్లె, జాజి, విరజాజి లాంటి పూలను వేసినట్లయితే ఆ నీళ్ళు మరింత పరిమళభరితంగా ఉంటాయి. కమలాపండు తొక్కలను స్నానం చేసే నీటిలో వేసి కొంతసేపు అయిన తరువాత స్నానం చేస్తే చర్మం సువాసనగా హాయిగా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎంతో అందంగా అలంకరించిన పెళ్ళి కూతురు పెళ్ళిపీటల మీదకు రాగానే పరిమళాలు వ్యాపిస్తాయి. అందుకే పెళ్ళికూతురుకు ఇలా పెళ్ళికి ముందు స్నానం చేయిస్తారు.