Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఇప్పటికే పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వర్షాలు ఏపీలో మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఆర్టీజీఎస్ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
అదేసమయంలో తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఆర్టీజీఎస్ తాజా బులెటిన్లో తెలిపింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గత రాత్రి 10 గంటల నుంచి రెండు గంటల వరకూ వర్షం కురిసింది.
ముఖ్యంగా, నగరంలోని ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్ పేట, కూకట్ పల్లి, దిల్సుఖ్ నగర్, లింగంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. బుధవారం ఉదయం వరకు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.